ఈ నెల 3 అంటే నేటి అర్థరాత్రి నుంచి దాదాపు అన్ని కంపెనీల మొబైల్ చార్జీలు పెరగనున్నాయి. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించారు. భారీ నష్టాలతో కుదేల వుతున్న కారణంగానే టెలికాం కంపెనీలు చార్జీలు పెంచాల్సి వస్తోందని కంపెనీ లు ప్రకటించుకున్నాయి. తొలిసారిగా ప్రీపెయిడ్ వినియోగదారులకు కాల్స్, డేటా ఛార్జీలు పెంచుతుండటం గత నాలుగేళ్లలో ఇదే ప్రధమం. ఈ సారి 50 % వరకు ఛార్జీలను వడ్డించే ఆస్కారం కనిపిస్తోంది. సొంత నెట్వర్కులకు చేసే కాల్స్ ఉచితంగా అందిస్తునే ఇతర నెట్వర్క్కు చేసే కాల్స్కు నిమిషన్ 6 పైసలు వసూలు చేయాలని టెలికాం సంస్థలు నిర్ణయించాయి. ఇక టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో.ఈ నెల 6 నుంచి పెంచిన కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని రిలయన్స్ జియో ప్రకటించిన విషయం తెలిసిందే
మొబైల్ టారిఫ్ల (ఫ్లోర్ ప్రైస్) నిర్ధారణలో ట్రాయ్, టెలికాం విభాగాల మధ్య ఏకాభిప్రాయం కొరవడటంతో కాల్ చార్జీల పెంపుపై అవి జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. దీంతో టెలికాం కంపెనీల పంట పండినట్టయ్యింది. నష్టాల మాటున ఛార్జీల పెంపు అనివార్యమంటూ టారిఫ్లు పెంచాలని నిర్ణయించిన టెలికాం కంపెనీలు.. మున్ముందు ఛార్జీలు పెరుగుతాయని తెలిపడం విశేషం.
కాగా ఏజీఆర్ విషయంలో కేంద్రప్రభుత్వంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు లైసెన్స్ ఫీజు చెల్లింపుల బకాయిలను జరిమానాలు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు వడ్డీలతో సహా చెల్లించాలని తీర్పును వెలువరించింది. దీంతో టెలికాం సంస్థలపై ఒక్కసారిగా 1.17 లక్షల కోట్ల భారం పడింది. వోడాఫోన్ ఐడియా రూ.44,150 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.35,586 కోట్లను టెలికాం శాఖకు చెల్లించాల్సి ఉంది. కాగా చెల్లించాల్సిన మొత్తం కన్నాఅధికంగా అంటే రూ.50,921కోట్ల నష్టాలను చవిచూస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా ప్రకటించడం మరో విశేషం.
ఈ బకాయిలు చెల్లించడంతో పాటు తమ టెలికాం సంస్థలు కొనసాగాలంటే.. వినియోగదారులపై భారం వేయక తప్పడం లేదని భావిస్తున్నాయి. వివిధ టెలికాం సంస్దలు ప్రకటించిన పెంపు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
వొడాఫోన్ ఐడియా
వొడాఫోన్ ఐడియా 42 శాతం ఛార్జీలను పెంచుతూ.. కొత్త ఛార్జీల పథకాలను ప్రకటించింది. దీంతో ప్రస్తుతం సంవత్సరం ప్యాక్లు రెండు రూ.988కి లభిస్తుండగా, ఇప్పుడు అది రూ.1499 కానుంది. రూ.1,699 ప్లాన్ ధర ఇకపై రూ.2,399కి అందుబాటులో ఉండనుంది. 84 రోజుల మూడు ప్లాన్లు, 28 రోజుల నాలుగు ప్లాన్లను అలాగే రెండు కాంబో ప్లాన్లను అందించనుంది. రూ.199ల నెల ప్లాన్ను రూ.249కి పెంచుతున్నామని వొడాఫోన్ ఐడియా తెలిపింది.
భారతీ ఎయిర్టెల్
పెంచిన ఛార్జీలు డిసెంబర్ 3 నుంచి అమల్లోకి వస్తాయని భారతీ ఎయిర్టెల్ ప్రటకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారులపై 50 శాతం ఛార్జీలను పెంచనుంది. సంవత్సర ప్యాక్ను రూ.998 ధరను రూ.1,499గా ప్రకటించింది. రూ.1,699 ప్లాన్ ధర ఇకపై రూ.2,399 ధరగా ఎయిర్టెల్ నిర్ణయించింది. 84 రోజులకు సంబంధించిన ప్లాన్ ధరను రూ.458 నుంచి రూ.598కి పెంచింది. రూ.199ల నెల ప్లాన్ను 25 శాతం పెంచి రూ.249 ప్లాన్ ధరను ప్రకటించింది.
రిలయన్స్ జియో
టెలికాం సంచలనం రిలయన్స్ జియో కూడా ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 6 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని సృష్టం చేసింది. దీంతో కాల్స్, డేటా ఛార్జీలు మరింత పెరగనున్నాయి. కాగా వినియోగదారులకు కొత్త ప్లాన్లలో అదనపు లాభాలుంటాయని తెలిపింది.